హైదరాబాద్ బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ జాగృతి విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది. ఇటీవల జాగృతి జనంబాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ప్రాంతంలో పర్యటించారు. విలువైన ఐడీపీఎల్ భూములను కాపాడాలంటూ స్థానికులు కవితకు విజ్ఞప్తి చేశారు. తన దృష్టికి వచ్చిన ఈ సమస్యను కవిత ప్రభుత్వానికి వెల్లడించింది.

ఇది జాగృతి విజయం
” తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ జాగృతి విజయమేనని చెప్పారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాలనే నేను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను.. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణ కు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. “
మాపై తప్పుడు ప్రచారం
“ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలి.. మా కుటుంబం పై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని స్పష్టం చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర విడిపించాలి. ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని డిమాండ్ చేస్తున్న.”








